'కృత్రిమ రెటీనా' రూపకల్పన

జెరూసలెం: దెబ్బతిన్న రెటీనాకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవటానికి వీలైన పలుచటి, కాంతికి స్పందించే కొత్త పొరను శాస్త్రవేత్తలు రూపొందించారు. నానోరాడ్స్‌, కార్బన్‌ నానోట్యూబ్స్‌తో తయారచేసిన దీన్ని టెల్‌ అవైవ్‌, హీబ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు కాంతికి స్పందించని కోడిపిల్ల రెటీనాతో పరీక్షించారు. ఇది కాంతిని గ్రహించినట్టు, నాడీసంబంధ చర్యను ప్రేరేపించినట్టు బయట పడటం విశేషం. ఇతర పరిజ్ఞానాలతో పోలిస్తే ఇది మరింత మన్నికైన, సమర్థవంతమైన, తేలికగా వంగే సామర్థ్యం గల పరికరమని పరిశోధకులు తెలిపారు. వయసుతో పాటు వచ్చే మాక్యులర్‌ డీజెనరేషన్‌ (ఏఎండీ) సమస్యతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడగలదని వివరించారు.

పాక్‌ అణు క్షిపణి పరీక్ష విజయవంతం

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 13: భారత్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకోగల అణుక్షిపణిని పాకిస్థాన్‌ గురువారం విజయవంతంగా పరీక్షించింది. 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదించగల ఈ క్షిపణికి అణు, సంప్రదాయ వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యముంది. హతాఫ్‌-6గా కూడా పిలిచే ఈ మధ్యశ్రేణి షహీన్‌-2 మిస్సైల్‌ను అరేబి యా సముద్రం నుంచి పరీక్షించినట్టు పాక్‌ సైన్యం తెలిపింది.

రేపటి నుంచే నగదు బదిలీ

సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.952.. నగదు బదిలీ రూ.508 పథకంపై విస్తృత ప్రచారం .. రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌, నవంబర్‌13 (ఆంధ్రజ్యోతి):గ్యాస్‌ వినియోగ దారులకుప్రభుత్వం నుంచి అం దేసబ్సిడీనినేరుగా వారి బ్యాంకు ఖాతాలోకే మళ్లించే 'నగదు బది లీ' పథకం శనివారం నుంచి ప్రారంభం కానుంది. తాజాగా అమలుచేయబోతున్న మాడిఫైడ్‌ డైరెక్ట్‌ బెనిఫిట్‌ ఫర్‌ ఎల్‌పీజీ(ఎండీబీటీఎల్‌) పథకం వల్ల గ్యాస్‌ వినియోగదారులకు ఏ విధమైన ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ పథకం అమలుకాబోతున్న హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు గురువారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో కమిటీలో సభ్యులుగా ఉన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్‌ ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి సి.పార్థసారథి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. శనివారం నుంచి అమలుకాబోతున్న ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో అనుమానాలు తొలగించి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ను నాన్‌సబ్సిడీ ధరలోనే అంటే.. రూ.952లకు వినియోగదారులకు అందిస్తారు. ప్రభుత్వం నుంచి వినియోగదారులకు రావాల్సిన సబ్సిడీని దాదాపు రూ.508లను వారి బ్యాంకుఖాతాకు మళ్లిస్తారు. బ్యాంకుఖాతాకు ఆధార్‌నెంబర్‌ను జత చేయని వారికి 3 నెలల సమయాన్ని గ్రేస్‌ పిరియడ్‌గా అంటే ఫిబ్ర వరి 14, 2015 వరకూ సబ్సిడీతో కూడిన సిలిండర్‌ను సరఫరా చేస్తారు. తర్వాత 2015, ఫిబ్రవరి 14 నుంచి మే 14, 2015 వరకూ మరోమూడు నెలల పాటు పార్కింగ్‌ పిరియడ్‌గా పరిగణించి సబ్సిడీ లేకుండానే నేరుగా సబ్సిడీయేతర సిలిండర్‌ను అందిస్తారు. తర్వాత బ్యాంక్‌లో ఆధార్‌ సమర్పించిన తర్వాత ఈ మూడు నెలకు సంబంధించి వినయోగదారులు చెల్లించిన అధిక మొత్తాన్ని తిరిగి వారి ఖాతాలో జమ చేస్తారు. ఫోన్‌లో సందేహాలు నివృత్తి గ్యాస్‌ సబ్సిడీని పొందాలంటే తప్పని సరిగా ఆధార్‌ ఉండాలన్న నిబంధనేమీ లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. బ్యాంక్‌ఖాతాను లింక్‌ చేస్తే సరిపోతుందని అన్నారు. ఈ సబ్సిడీ వివరాలను వినియోగదారులు నేరుగా గ్యాస్‌డీలర్‌, బ్యాంక్‌ఖాతా, ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నారు. వినియోగదారులు సబ్సిడీకి సంబంధించి తమ బ్యాంక్‌ఖాతాకు లింక్‌ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే సెల్‌ఫోన్‌ నుంచి స్టార్‌99స్టార్‌99యాష్‌ డయల్‌ చేస్తే వివరాలు తెలిజేస్తారు. అలాగే వినియోగదారులకు 17అంకెలతో ఐడీ నెంబర్‌ను వారి బ్యాంక్‌ఖాతాకు లింక్‌ చేశారు. దీని ద్వారా సబ్సిడీని ఆధార్‌ లేకుండా అందుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్‌ సబ్సిడీకి సంబంధించి వినియోగదారులు ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 18002333555 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేయవచ్చని అధికారులు తెలిపారు

Followers