ఖాళీల లెక్కలివ్వండి...

శాఖలవారీగా వివరాలు కోరుతున్న సర్కారు -నాలుగురోజులుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సీఎస్ -1,07,744 ఖాళీలున్నట్లు ప్రాథమిక అంచనా హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కోటి ఆశలతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను తీర్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్ర ఉద్యోగుల సంఖ్య తేలనప్పటికీ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రాష్ట్రంలో 1,07,744 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. కేంద్రం ఉద్యోగుల విభజనను ఖరారు చేయగానే మిగిలిన సిబ్బంది సంఖ్య తెలుస్తుందని, దీంతో వెనువెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాఖలవారీగా ప్రస్తుతమున్న ఖాళీల వివరాలను తెప్పించుకుంటున్నది. ఉద్యోగ నియామకాల కసరత్తు ప్రక్రియలో మొదటి అడుగును దాటేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నాలుగురోజులుగా శాఖలవారీగా నేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గురువారంనాడు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖాళీల నియామకాలను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడంతో తెలంగాణకు ఎంతమంది మిగులుతారో తేలడం లేదు. ఎక్కువమంది ఆంధ్రా ఉద్యోగులు వర్క్ టూ ఆర్డర్ కింద తెలంగాణలో పని చేస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు కొంతమంది ఆంధ్రాలో పనిచేస్తున్నారు. ఉద్యోగుల విభజనకు తుదిరూపం వస్లే ఏ రాష్ట్రంలో ఎంతమంది పనిచేయాలనే లెక్క తేలుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగుల ఖాళీలు లక్ష నుంచి లక్షన్నర వరకు తేలే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకుడొకరు అన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే శాఖలవారీగా ఖాళీల లెక్కలను సర్కారు తీసుకున్నది. విభజన ప్రక్రియ పూర్తికాగానే రోస్టర్ పాయింట్లు కూడా నిర్ధారించుకొని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.


భూ సేకరణ బిల్లు


భూసేకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సవరించడం, అమలు దశలో అన్యాయం జరగకుండా చూడడం అవసరం. కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం జారీ చేసిన బిల్లు చట్టరూపం పొందితే భూమి సేకరించడానికి రైతుల ఆమోదం అవసరం ఉండదు. సమాజంపై ప్రభావ అంచనా కూడా ఉండదు. ఈ రెండు అంశాలు లేకపోతే 2013 నాటి చట్ట లక్ష్యమే దెబ్బతింటుంది. భూ సేకరణ చట్టంలో సవరణలు చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు తీవ్ర నిరసన ఎదురవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదమూడు పార్టీలు మంగళవారం నిరసన తెలిపాయి. 2013లో యూపీఏ ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజా సవరణలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో కూడా శ్రద్ధ వహించారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును మోడీ ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదించగలిగినా ప్రతిపక్షాలకు అధిక బలం ఉన్న రాజ్యసభలో గట్టెక్కడం అంత సులభం కాదు. రాజ్యసభ ఈ బిల్లును తిరస్కరించినా లోక్‌సభలో ఉన్న మెజారిటీ మూలంగా ఈ బిల్లుకు చట్టరూపం ఇవ్వడం కష్టమేమీ కాదు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నా యి. ప్రతిపక్షాలు ఊరేగింపుగా వెళ్ళి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం ఇందులో భాగమే. ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని మోడీ బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తున్నది. అయితే రాష్ట్రపతి చేత పార్లమెంటును ప్రొరోగ్ (నిరవధిక వాయిదా) చేయించి భూసేకరణ ఆర్డినెన్స్‌ను కొత్తగా జారీ చేయాలనే ఎత్తుగడ పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టాన్ని ప్రవేశ పెట్టడానికి ముందు, పరిశ్రమలకు భూములు కట్టబెట్డానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరించాయి. గ్రామ సభలను తూతూ మంత్రం అన్నట్టుగా జరిపేవారు. కంపెనీల ప్రతినిధులు రాజకీయ నాయకుల అండ సంపాదించి, పోలీసులను భారీగా మోహరింప చేసి రైతులు ఆమోదించినట్టు తతంగం నడిపేవారు. రైతుల భూములు నిర్దాక్షిణ్యంగా గుంజుకునేవారు. అందుకే 2013 చట్టంలో రెండు ప్రధానాంశాలు ఉన్నాయి. ఒకటి- భూసేకరణ పారదర్శకంగా జరపాలనేది. ప్రైవేటు కంపెనీల కోసం అయితే 80 శాతం రైతుల ఆమోదం తప్పనిసరి. అదే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే 70 శాతం ఆమోదం ఉండా లె. ఈ చట్టంలోని రెండవ ప్రధా న అంశం- సమాజంపై ప్రభావం అంచనా. సాధారణంగా నష్ట పరిహారం భూమి ఉన్నవారికే వస్తుం ది. కానీ ప్రభు త్వం చిత్తశుద్ధితో పునరావాస చర్య లు తీసుకోవాలంటే సమాజంపై ప్రభావం అంచ నా తప్పనిసరి. నిజానికి ఒక ప్రాంతాన్ని ముంచాలన్నా, ప్రజలను తరలించి వేరే వారికి అప్పగించాలన్నా ఇటువంటి అంచనాలు వేయడం అవసరం కూడా. యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయదని విమర్శించే సంఘ సేవా సంస్థలు ఉన్నా యి. అయితే ఉన్నంతలో గతంతో పోలిస్తే ఇదొక ముందడుగు. భూసేకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సవరించడం, అమలు దశలో అన్యాయం జరగకుండా చూడడం అవసరం. కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం జారీ చేసిన బిల్లు చట్టరూపం పొందితే భూమి సేకరించడానికి రైతుల ఆమోదం అవసరం ఉండదు. సమాజంపై ప్రభావ అంచనా కూడా ఉండదు. ఈ రెండు అంశాలు లేకపోతే 2013 నాటి చట్ట లక్ష్యమే దెబ్బతింటుంది. రాష్ట్ర విభజన సక్రమంగా జరగకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్న టీఆరెస్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వంతో సంబంధాలు సున్నితంగా మారా యి. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూనే భూసేకరణ చట్టంలోని ప్రజా వ్యతిరేక స్వభావాన్ని వ్యతిరేకించడంలో టీఆరెస్ సభ్యులు వెనకాడలేదు. అయితే రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నందు వల్ల, కేంద్ర చట్టంలో తగు వెసులుబాటు ఏర్పాటు చేసుకొని, అమలు దశలో తాము ప్రజానుకూలంగా వ్యవహరించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. కీలకాంశాలను రాష్ర్టాలకు వదిలేసే విధంగా సవరణలను ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో టీఆరెస్ సభ్యులు వివరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించడం మంచిది. 2013 నాటి కేంద్ర భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలె. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఈ దిశగా అడుగు వేయలేదు. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించుకున్న తొలి రాష్ట్రంగా ఆదర్శంగా నిలిచిందని టీఆరెస్ సభ్యులు లోక్‌సభలో వెల్లడించారు. సమాజంపై ప్రభావ అంచనా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణుల చేత శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని కూడా ప్రస్తావించారు. పారిశ్రామికాభివృద్ధి అవసరాన్ని ఎవరూ కాదనలేరు. పైగా ఇప్పుడున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులు తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో తమ బాధ్యతను విస్మరించకూడదు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములను గుంజుకొని బంధుగణానికి పంచిపెట్టిన దుర్నీతిని కూడా లోక్‌సభలో టీఆరెస్ సభ్యులు ప్రస్తావించారు. ఈ దురాగతాలను గుర్తించి భూసేకరణ చట్ట సవరణను మోడీ ప్రభుత్వం పునరాలోచించడం మంచిది.


అన్నా హజారేకు సోనియా లేఖ

 భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అన్నాకు ఓ లేఖ రాశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 14 పార్టీలు సోనియా నేతత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు చేపట్టిన ర్యాలీపై అన్నా తనకు రాసిన లేఖకు ఆమె సమాధానంగా ఈ లేఖ రాశారు. 'భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై మీరు సందేహాలు వ్యక్తం చేస్తూ మార్చి 14న మీరు రాసిన లేఖ అందింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు, సవరణ బిల్లుపై మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అన్ని వేదికలపైనా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టడం కూడా బిల్లుపై మా వ్యతిరేకతను వ్యక్తం చేయటంలో భాగమే. దీనికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుందని మీకు హామీ ఇస్తున్నా'అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.


43 ఏళ్లు మగవాడిలా....


43 ellu magavaadila....


కన్న కూతురును పెంచి పెద్ద చేయడం కోసం 43 ఏళ్లపాటు ముమ్మూర్తులా మగవాడిలా బతికిన ఆ మాతృమూర్తి గొప్పతనాన్ని ఏ అవార్డులతో తూచగలం? అయినా లగ్జర్ సోషల్ సాలిడారిటీ డైరెక్టరేట్ తనవంతు కర్తవ్యంగా మంగళవారం ఆమెను *ఏ విమన్ బ్రెడ్ విన్నర్* అవార్డుతో సత్కరించి 'కైరో ఆదర్శ మాతృమూర్తి'గా కీర్తించింది. 64 ఏళ్ల ఆ మాతృమూర్తి పేరు సిసా అబూ దాహ్. కైరోకు 635 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్జర్ గవర్నేట్ రాజధాని నగరమైన లగ్జర్‌లోనే ఆమె జీవితమంతా గడిచింది. తన 21వ ఏట కన్న కూతురు కడుపులో ఉండగానే కట్టుకున్న భర్త కన్నుమూశాడు. అప్పటికి ఆస్తిపాస్తులు అసలే లేవు. నా అనే వాళ్లు అంతకన్నా లేరు. వారి కమ్యూనిటీలో స్త్రీలు బయటకెళ్లి కూలి పనిచేయడం నేరం. బిచ్చమెత్తుకొని జీవించడం ఆమెకు ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో పురుషుడి అవతారం ఎత్తక తప్పలేదు. ఎక్కడా స్త్రీత్వం ఆనవాళ్లు కూడా కనిపించకుండా జుట్టు కత్తిరించుకొని వదులుగా ఉండే మగవాడి దుస్తులేసుకొని కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. మగవాడిలానే మాట్లాడడం అలవాటు చేసుకొంది. భవన నిర్మాణ పనుల్లో ఇటుకలు మోసింది. సిమెంటు బస్తాలు భుజాన వేసుకొంది. ఖాళీ సమయాల్లో షూ పాలిష్ చేసింది. అలా వచ్చిన సంపాదనతో కూతురును పెంచి పెద్ద చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసింది. కష్ట పడేవారికే కష్టాలు కాచుకు కూర్చుంటాయన్నట్టుగా అనారోగ్యం వల్ల అల్లుడు మంచం పట్టాడు. మళ్లీ కుటుంబపోషణ భారమంతా తనపైనే పడింది. పరిస్థితులకు ఎదురీదక తప్పలేదు. వయస్సు మీద పడటంతో ఈసారి మాత్రం బరువు పనుల జోలికి వెళ్లకుండా బూటు పాలిష్‌ను వృత్తిగా చేసుకొంది. లగ్జర్ నగర వీధుల్లో నేటికి కనిపించే సీసా అబూను ఎవరూ మహిళ అనుకోరు. దాదాపు 43 ఏళ్ల పాటు మగవారితో కలిసి పనిచేసినా, వారి వెంట తిరిగినా ఎవరు తనను స్త్రీ అని ఇంతవరకు గుర్తించలేదని ఆమే తెలిపారు. అందువల్ల మగవారి వేధింపులను కూడా తాను ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పారు. ఆ ఆదర్శ మాతృమూర్తికి హాట్సాప్!



Followers