ఎపిపిఎస్‌సి ఎగ్జామ్స్‌కు ఏ పుస్తకాలు చదవాలి?


ఎపిపిఎస్‌సి వివిధ రిక్రూట్‌మెంట్లకు ప్రశ్నపత్రాలను రూపొందిం చేటప్పుడు ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటుంది? ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు వంటివి రిఫరెన్స్‌గా తీసుకుంటుందా? ఎపిపిఎస్‌సి పరీక్షలకు ఏ పుస్తకాలు చదవడం మంచింది?- ఆర్. రమణ, నిజామాబాద్. జ : ఎపిపిఎస్‌సి నిర్వహించే పోటీపరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పరీక్షకు సంబంధించి విడుదల చేసిన సిలబస్, ఆధారంగానే ప్రశ్నపత్రాలు రూపొందుతాయి. అయితే సిలబస్ రూపకల్పన సందర్భంలో మాత్రమే ఎపిపిఎస్‌సి పాత్ర ఉంటుంది. అదీ కూడా ఒక నిపుణులు కమిటీ సూచించిన విధంగానే సిలబస్‌ను ఫైనల్ చేయడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన అంతా కూడా సంబందిత సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో జరుగుతుంది. ఇందులో ఎపిపిఎస్‌సి పాత్ర ఎంత మాత్రం ఉండదు. అయితే ఆయా సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపిక చేయడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపికలో సాధారణంగా సీనియర్ వెూస్ట్ ప్రొఫెసర్, సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన వర్తమాన అంశాలను నిరంతరం ఫాలో అవుతున్న వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన సమయంలో ఎపిపిఎస్‌సి కేవలం సిలబస్‌ను మాత్రమే ఎక్ప్‌పర్ట్‌కు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నల స్థాయి, తీరు ఎక్స్‌పర్ట్ విచక్షణకే వదిలివేయడం జరుగుతుంది. ఎక్స్‌పర్ట్స్ సాధారణంగా ఆయా సిలబస్‌లోని అంశాలు గల స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ నుండే ప్రశ్నలను రూపొందించడం జరుగుతుంది. పబ్లికేషన్ డివిజన్, సమాచార మంత్రిత్వశాఖ ప్రచురించిన పుస్తకాలను, ఎన్‌సిఇఆర్‌టి, ప్రభుత్వ విభాగాలు రూపొందించిన పుస్తకాలు (తెలుగు అకాడమి లాంటివి) రిఫర్ చేసి ప్రశ్నలను రూపొందిస్తారు. అయితే పుస్తకాలలోని సమాచారాన్ని యథాతదంగా మాత్రం ఇవ్వడం జరగదు. అందువల్ల వీటిని చదివి అర్థం చేసుకోగలిగితేనే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడం సాధ్యం అవుతుంది. కాబట్టి చదివిన సమాచారాన్ని వివిధ కొణాలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాసం ఎన్ని పేజీలు రాయాలి? ప్ర : గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్‌లో రాయవలసిన మూడు వ్యాసాలలో ప్రతివ్యాసం మాములుగా ఎన్ని పేజీలు రాయాలి? కొంతమంది అభ్యర్థులు సగటున మూడు వ్యాసాలకు కలిపి 20 పేజీలు రాస్తుండగా, మరికొంతమంది అభ్యర్థులు చాలా ఎక్కువ పేజీలు రాయడం జరుగుతుంది. వీటిలో ఏది సరైన పద్ధతి?- కె. సుదీర్, కరీనంగర్. జ : గ్రూప్-1 జనరల్ ఎస్సే పేపర్‌లో మూడు గంటల సమయంలో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఎన్ని పేజీలలో రాయాలన్న విషయం కేవలం అపోహ మాత్రమే. గతంలో ఒకే వ్యాసం రాసే పద్ధతి ఉండేది. మారిన నూతన విధానంలో ఇదే సమయంలో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రశ్న చాలా సుదీర్ఘంగా విభిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది ఒక రకంగా గతంలోని ఆప్షనల్స్ పేపర్లలో వ్యాసరూప ప్రశ్నల కన్నా కొంచెం ఎక్కువ సమాధానాన్ని రాసే విధంగా ఉంటున్నాయి.జనరల్ ఎస్సే రాసేటప్పుడు పేజీల సంఖ్య కన్నా అందు బాటులో వున్న సమయంలో ప్రశ్నలో అడిగిన అన్ని అంశాలను సృశిస్తూ, మిగతా అభ్యర్థుల కన్నా నాణ్యమైన, ఖచ్చితమైన, నిర్థిష్ఠమైన , తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా , సరళమైన భాషలో సులువుగా అర్థమయ్యే విధంగా వేగంగా రాయగలడం పై ప్రధానంగా దృష్టి సారించాలి.పేజీల సంఖ్య అనేది ముఖ్యంకాదు , సమాధానంలోని సమాచారం అత్యంత కీలకమని గుర్తించాలి. అయితే ఒక గంట సమయంలో, అక్షరాల సైజు సాధారణంగా రాయగల అభ్యర్థి అర్థమయ్యే రీతిలో కనిష్టంగా 8 పేజీలు, గరిష్టంగా 12 పేజీల వరకు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులను అనుకరించకుండా రైటింగ్‌లో వేగాన్ని పెంచుకోవడం, భాషపైన పట్టు సాధించడం, ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం మంచిది. గ్రూప్-2 ఎకానమీ చదివేదెలా? ప్ర : నాది గ్రామీణ నేపథ్యం, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను. డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పూర్తి చేశాను. గ్రూప్-2లో మొదటి, రెండవ పేపర్లకు భాగానే ప్రిపేరవుతున్నాను. కానీ ఎకానమి పేపర్ గందరగోళంగా ఉంది. ఎకానమీకి అకాడమీ పుస్తకాలు చదువుతున్నాను. కానీ అవి గ్రూప్-2 సిలబస్‌కు అనుగుణంగా లేకపోవడం వలన ఏవి చదవాలో, ఏవి వదిలేయాలో తెలియడం లేదు. ఎకానమీలో నేను గట్టెక్కడానికి పరిష్కారం చూపగలరు? - అప్పాన సూర్య, కొత్తకోట. జ : ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్‌కావాలి. గ్రామీణ నేపథ్యం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఐ.ఎస్ సాధించిన ఉదహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ కాగలిగితే అంతిమ విజయం మీదేనని బలంగా నమ్మాలి. వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందుతున్నప్పుడు అది మనెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకోవాలి. గ్రూప్-2లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, కోచింగ్‌లు, ఆర్థిక స్థోమత, అదృష్టం వంటి అంశాలకన్నా కఠోర దీక్షతో, పట్టుదలతో నిరంతరం తెలుసుకోవాలన్న తపనతో, సాధించాలన్న కసితో ఒక యజ్ఞంలాగా సరైన గైడెన్స్‌తో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికే అధిక ప్రాధాన్యనివ్వాలన్న విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక గ్రూప్-2 ఎకానమి పేపర్‌లో అత్యదిక మార్కులు పొందాలంటే కొంచెం ఎక్కువ సమయం కేటాయించి, ఎక్కువగా కష్టపడటం తప్పనిసరి. ఎకానమికి సంబంధించిన మౌలికమైన అంశాలను తెలుసుకోవడానికి తెలుగు అకాడమి ఇంటర్ స్థాయి పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రూప్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకాడమి పుస్తకాలను చదివేటప్పుడు, సిలబస్‌ను ముందు పెట్టుకొని అందులోని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పాయింట్ల రూపంలో నోట్ చేసుకోవాలి. అదే విధంగా రోజూ పేపర్లలో వస్తున్న ఎకానమీ సంబంధిత అంశాలను, పోటీపరీక్షల మ్యాగ్‌జైన్‌లలో వున్న అంశాలను నిరంతరం అనుసంధానించు కుంటూ చదవగలిగితే గరిష్ట మార్కులు పొందవచ్చు.

Followers