ఆటోమేటిక్ ప్రమోషన్‌పై రాష్ర్టాల అభ్యంతరం


ఎనిమిదో తరగతి వరకు నిర్బంధం లేని విద్యా విధానం పట్ల పలు రాష్ర్టాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని పేర్కొన్నాయి. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానంపై సంప్రదింపుల్లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ర్టాలకు చెందిన విద్యా మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ విద్యా మంత్రి పరస్‌చందర్ మాట్లాడుతూ, ఆటోమేటిక్ క్లాస్ ప్రమోషన్ వల్ల విద్యార్థులు ఎనిమిదో తరగతి వరకూ ఫెయిర్ కారని, అలాగే ఆ తరువాత పై తరగతికి ప్రమోషన్ కూడా పొందలేరని వివరించారు. ఈ వాదనతో అస్సాం, నాగాలాండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల మంత్రులు ఏకీభవించారు. హర్యానా విద్యామంత్రి గీతా బుక్కల్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది క్లాస్ ప్రమోషన్ల విధానాన్ని సిఫార్సు చేసింది. విద్యా హక్కు చట్టంతోపాటే ఈ వివాదాస్పద విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రతిభతో నిమిత్తం లేకుండా విద్యార్థి ఎనిమిదో తరగతి వరకు ప్రమోట్ అవుతాడు. పాఠశాల పరీక్ష వ్యవస్థను సంస్కరించడం ఈ సంప్రదింపుల్లో ఓ భాగమని పాఠశాల విద్యా శాఖకార్యదర్శి వృందా సరూప్ చెప్పారు.

Followers