పంచాయతీరాజ్‌ను మొదట అమలుచేసిన రాష్ట్రం


ఇండియన్ పాలిటి దంత్‌వాలా కమిటీ (1978) బ్లాక్ స్థాయిలో ప్రణాళీకరణపై అధ్యయనం చేసేందుకు దంత్‌వాల కమిటీని ఏర్పాటు చేశారు. సిఫార్సులు -గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ను ప్రత్యేక పద్ధతిలో ఎన్నుకోవాలి. -మధ్యస్థ వ్యవస్థ(బ్లాక్ స్థాయి)కి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలి. -జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధానపాత్ర పోషించాలి. -బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రణాళికలను రూపొందించాలి. సర్కారియా కమిషన్ (1988) - క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. - స్థానిక సంస్థలను రద్దు చేయడానికి సంబంధించి అన్నిరాష్ర్టాల్లో ఒకే రకమైన చట్టాలను అమలు చేయాలి. -పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలి. -స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధుల పరంగా పటిష్ట పరచాలి. - దేశానికి కంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించాలని పేర్కొంది. సీహెచ్ హనుమంతరావు కమిటీ (1984) - మంత్రి అధ్యక్షతనగానీ, కలెక్టర్ అధ్యక్షతనగానీ పనిచేసే జిల్లా ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేయాలి. -బ్లాక్ అభివృద్ధి అధికారి పోస్టును రద్దు చేయాలి. జీవీకే రావు కమిటీ (1985) ప్రణాళికా సంఘం 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన-పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించేందుకు జీవీకే రావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో పరిపాలనా స్ఫూర్తి క్రమంగా బలహీనపడి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీపరచిందని, తద్వారా ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే వ్యవస్థగా కాకుండా వేళ్లులేని వ్యవస్థగా మారిందని(It is not a grass roots democracy, It is grass without roots) తీవ్రంగా ఆక్షేపించి పంచాయతీరాజ్ పటిష్టతకు సిఫార్సులు చేసింది. సిఫార్సులు -ప్రణాళికాభివృద్ధికి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలి. -బ్లాక్ వ్యవస్థ రద్దు -జిల్లా పరిషత్‌ను పటిష్ట పరచాలి. -నైష్పత్తిక ప్రాతినిథ్యంతో కూడిన ఉపకమిటీలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. -క్రమం తప్పకుండా గడువుకాలం లోపల పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. -జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని ఏర్పాటు చేసి అతన్ని జిల్లా పరిషత్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన కార్యనిర్వాహక బాధ్యతలను అప్పగించాలి. -జిల్లా పరిషత్ చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి. సింఘ్వీ కమిటీ (1986) 1986లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేసేందుకు అవసరమైన సిఫార్పులను చేసేందుకు ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. సిఫార్సులు -స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలి. -పంచాయతీలకు ఆర్థిక వనరులు కల్పించాలి. -కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. -క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. -పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. తుంగన్ కేబినెట్ సబ్ కమిటీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంట్ సంప్రదింపుల సబ్‌కమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. సిఫార్సులు - స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి. -జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీ సఫార్సుల మేరకు 64వ రాజ్యంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 15మే 1989న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్‌సభలో 2/3 వంతుల మెజార్టీ పొందినప్పటికీ రాజ్యసభలో రెండు ఓట్లు తక్కువ కావడంతో వీగిపోయింది. తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 7 సెప్టెంబర్ 1990న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు. తర్వాత పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించవలసిన విషయాన్ని గుర్తించి సెప్టెంబర్ 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ(పురపాలక సంఘాలకు)లకు సంబంధించిన బిల్లును వేరువేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 22 డిసెంబర్ 1991లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపించారు. మెజార్టీ రాష్ర్టాల శాసనసభలు(17 రాష్ర్టాలు) దీనికి ఆమోదం తెలిపాయి. అప్పటి భారత రాష్ట్రపతి(శంకర్ దయాళ్ శర్మ) ఆ బిల్లులపై 20 ఏప్రిల్ 1993లో సంతకం చేశారు. తద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. నోట్ : పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ 24 ఏప్రిల్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకొంటారు. -పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1 జూన్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. -73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 24 ఏప్రిల్ 2013కు 20ఏళ్లు పూర్త య్యాయి. -73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం- కర్ణాటక, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 10 మే 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోనే పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకయే.


Followers