డిజిటల్ ఇండియా


అడుగడుగునా మనిషి కదలికను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పరచినప్పుడు, అది దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పుడిప్పుడే డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందున, దీని పర్యవసానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలె.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సమాజ సంక్షేమం కోసం వినియోగించాలె. ఆర్థిక,పారిశ్రామికాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి పైనా దృష్టి సారించాలె. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవిష్కరించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశాన్ని సరికొత్త సాంకేతిక యుగంలోకి నడిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది పారిశ్రామికవేత్తలు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. ఈ పథకం అమలు కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి సాంకేతిక పరిశ్రమలు సుముఖత వ్యక్తం చేశాయి. దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పించి డిజిటల్ కార్యకలాపాలను గ్రామాలలో సైతం అందుబాటు లోకి తేవడం, సేవారంగాన్ని డిజిటల్ రూపంలో సాగించడం, డిజిటల్ పరిజ్ఞానం పెంచడం ప్రధాన లక్ష్యాలు. వీటికి తోడు 2020 కల్లా ఎలక్ట్రానిక్ దిగుమతులు లేకుండా దేశంలో ఉత్పత్తి సాగించడం మరో లక్ష్యం. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్ల పది కోట్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంటున్నారు. గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ- గవర్నన్స్ పథకంతో పోలిస్తే మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా మరింత విస్తృతమైన కార్యక్రమం. డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం ఇప్పటికే నగర ప్రాంతంలో సాధారణమైపోయింది. రైలు, బస్సు టికెట్ బుక్ చేయాలన్నా, సినిమా టికెట్ తీసుకోవాల న్నా ఇప్పుడు సులభమైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు బిల్లులను నెట్ ద్వారా చెల్లిస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్ వల్ల కాలు గడప దాటకుండానే, కోరుకున్న వస్తువులు వచ్చి ఒడిలో వాలుతున్నాయి. వైద్యం, బ్యాకింగ్ రంగాలలో భారీ మార్పులు వచ్చా యి. విద్యారంగం గురించి చెప్పనవసరం లేదు. మొదటగా డిజిటల్ పరిజ్ఞానాన్ని అలవరచుకున్నది విద్యార్థులే. ఇప్పుడు రైతులు కూడా టాబ్లెట్‌ను వాడే రోజులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి మనిషికి కావలసింది రోటీ, కప్డా ఔర్ మకాన్ అని చెప్పేవారు. ఇప్పుడు రోటీ, కప్డా ఔర్ మొబై ల్ అనే హాస్యోక్తి ప్రచారమైంది. అయినప్పటి కీ దేశంలో పూర్తిగా డిజిటల్ విప్లవం వచ్చేసిందని చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలే ఇంకా పూర్తిగా డిజిటైజ్ కాలేదు. ప్రధాని చెప్పిన ఎం (మొబైల్) గవర్నన్స్ అనే ది ఇంకా భారతీయ గ్రామీణ సామాజానికి చాలా దూరంలో ఉన్నది. డిజిటల్ కనెక్టివిటీ లో మన దేశం ఇంకా వందవ స్థానంలో కూడా లేదు. రెండున్నర లక్షల గ్రామాలకు బ్రాడ్‌బాండ్ వసతి కల్పించడం అంత సుల భం కాదు. ఉద్యమ స్ఫూర్తితో ఈ మౌలిక వసతులు కల్పిస్తే మాత్రం ఈ సాంకేతిక పరిజ్ఞానం సమాజంలో భారీ పరివర్తనను తీసుకురాగలుగుతుంది. డిజిటీకరణ పథకాలు అమలైతే వివిధ సేవలు, ఇతర కార్యకలాపాలు సౌకర్యవంతమవుతాయి. అయితే ప్రతి కార్యక్రమానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నట్టే దీనికి కూడా ఉంటాయి. చిత్తశుద్ధి ఉంటే వాటిని అధిగమించడం కూడా అసాధ్యం కాదు. అయితే డిజిటీకరణ జరిగితే కష్టాలన్నీ తీరుతాయంటూ అరచేతిలో స్వర్గం చూపెట్టడం సరికాదు. ప్రధాని మోదీ ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త దీన్ని ఆకాశానికెత్తాడు. దేశ వ్యాప్తంగా డిజిటల్ అనుసంధానం వల్ల ప్రజలకు మిగతా ప్రపంచంతో సం బంధం ఏర్పడి అత్యంత శక్తి లభిస్తుందని అన్నారు. కొత్తగా కనుగొన్న ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా సమాజ సంక్షేమం కోసం ఉపయోగించుకోవచ్చు. పారిశ్రామిక విప్లవం ప్రజా జీవనంలో గుణాత్మక మార్పును తీసుకొచ్చింది. అయితే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయా? ప్రజా జీవనం నరకప్రాయమైందా అనేది దాని ఉపయోగాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రెండవ పారిశ్రామిక విప్లవంగా చెప్పుకుంటున్న డిజిటీకరణను కూడా తక్కువ చేయలేము. కానీ దీనిని ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలె. అనేక సామాజిక సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించలేము. ఉదాహరణకు డిజిటీకరణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, లంచగొండితనం అంతరిస్తుంద ని, పనిదనం మెరుగుపడుతుందని ఇట్లా రకరకాల ఆశలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలన్నీ సామాజిక సంస్కృతికి, పరిపాలనా విధానానికి సంబంధించినవి. ప్రభుత్వంలో, ప్రజల్లో పరివర్తన లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సాధించలేము. ఇదే విధంగా అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశాలలో పౌరుడి గోప్యతకు భరోసా లేకుండా పోతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా మనిషి కదలికను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పరచినప్పుడు, అది దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పుడిప్పుడే డిజిటల్ ప్రపంచంలో కి అడుగు పెడుతున్నందున, దీని పర్యవసానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలె. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సమాజ సంక్షేమం కోసం వినియోగించాలె. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి పైనా దృష్టి సారించాలె.



Followers