అన్నా హజారేకు సోనియా లేఖ

 భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అన్నాకు ఓ లేఖ రాశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 14 పార్టీలు సోనియా నేతత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు చేపట్టిన ర్యాలీపై అన్నా తనకు రాసిన లేఖకు ఆమె సమాధానంగా ఈ లేఖ రాశారు. 'భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై మీరు సందేహాలు వ్యక్తం చేస్తూ మార్చి 14న మీరు రాసిన లేఖ అందింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు, సవరణ బిల్లుపై మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అన్ని వేదికలపైనా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టడం కూడా బిల్లుపై మా వ్యతిరేకతను వ్యక్తం చేయటంలో భాగమే. దీనికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుందని మీకు హామీ ఇస్తున్నా'అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.


43 ఏళ్లు మగవాడిలా....


43 ellu magavaadila....


కన్న కూతురును పెంచి పెద్ద చేయడం కోసం 43 ఏళ్లపాటు ముమ్మూర్తులా మగవాడిలా బతికిన ఆ మాతృమూర్తి గొప్పతనాన్ని ఏ అవార్డులతో తూచగలం? అయినా లగ్జర్ సోషల్ సాలిడారిటీ డైరెక్టరేట్ తనవంతు కర్తవ్యంగా మంగళవారం ఆమెను *ఏ విమన్ బ్రెడ్ విన్నర్* అవార్డుతో సత్కరించి 'కైరో ఆదర్శ మాతృమూర్తి'గా కీర్తించింది. 64 ఏళ్ల ఆ మాతృమూర్తి పేరు సిసా అబూ దాహ్. కైరోకు 635 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్జర్ గవర్నేట్ రాజధాని నగరమైన లగ్జర్‌లోనే ఆమె జీవితమంతా గడిచింది. తన 21వ ఏట కన్న కూతురు కడుపులో ఉండగానే కట్టుకున్న భర్త కన్నుమూశాడు. అప్పటికి ఆస్తిపాస్తులు అసలే లేవు. నా అనే వాళ్లు అంతకన్నా లేరు. వారి కమ్యూనిటీలో స్త్రీలు బయటకెళ్లి కూలి పనిచేయడం నేరం. బిచ్చమెత్తుకొని జీవించడం ఆమెకు ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో పురుషుడి అవతారం ఎత్తక తప్పలేదు. ఎక్కడా స్త్రీత్వం ఆనవాళ్లు కూడా కనిపించకుండా జుట్టు కత్తిరించుకొని వదులుగా ఉండే మగవాడి దుస్తులేసుకొని కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. మగవాడిలానే మాట్లాడడం అలవాటు చేసుకొంది. భవన నిర్మాణ పనుల్లో ఇటుకలు మోసింది. సిమెంటు బస్తాలు భుజాన వేసుకొంది. ఖాళీ సమయాల్లో షూ పాలిష్ చేసింది. అలా వచ్చిన సంపాదనతో కూతురును పెంచి పెద్ద చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసింది. కష్ట పడేవారికే కష్టాలు కాచుకు కూర్చుంటాయన్నట్టుగా అనారోగ్యం వల్ల అల్లుడు మంచం పట్టాడు. మళ్లీ కుటుంబపోషణ భారమంతా తనపైనే పడింది. పరిస్థితులకు ఎదురీదక తప్పలేదు. వయస్సు మీద పడటంతో ఈసారి మాత్రం బరువు పనుల జోలికి వెళ్లకుండా బూటు పాలిష్‌ను వృత్తిగా చేసుకొంది. లగ్జర్ నగర వీధుల్లో నేటికి కనిపించే సీసా అబూను ఎవరూ మహిళ అనుకోరు. దాదాపు 43 ఏళ్ల పాటు మగవారితో కలిసి పనిచేసినా, వారి వెంట తిరిగినా ఎవరు తనను స్త్రీ అని ఇంతవరకు గుర్తించలేదని ఆమే తెలిపారు. అందువల్ల మగవారి వేధింపులను కూడా తాను ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పారు. ఆ ఆదర్శ మాతృమూర్తికి హాట్సాప్!



Followers