జగమంత యోగా.. గిన్నిస్‌లో జాగా


jagamanta  yoga.. ginnislo  jaaga

యోగా.. ప్రపంచమంతా పఠిస్తున్న జపం. 5 వేల ఏండ్లకింద భారత్‌లో ఆవిర్భవించిన ఈ శక్తి.. అంతర్జాయతీయ యోగా దినోత్సవంతో విశ్వమంతా వ్యాపించింది. ఏకంగా 177 దేశాలు యోగా ఔన్నత్యానికి వినమ్రంగా తలవంచాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి నుంచి ఈఫిల్ టవర్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు యోగా జయకేతనం ఎగురువేసింది. ఆదివారం ఈ చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం వహిస్తూ.. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో యోగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ సహా 35వేలమంది ఒకేసారి యోగాభ్యాసం చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ యోగాపథ్‌గా మారింది. ఇంత పెద్దఎత్తున ప్రజలు ఒకేసారి యోగా చేయడం, అందులోనూ 84 దేశాలకు చెందిన జాతీయులు పాల్గొనడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. -రెండు రికార్డులు సొంతం -చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం -ఢిల్లీలో యోగాపథ్‌గా మారిన రాజ్‌పథ్ -దేశవిదేశాల్లో ఉత్సాహంతో యోగాభ్యాసం -ప్రపంచశాంతికి ఇది నాంది: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా భారత సైనికులు యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. యోగా డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సమైక్యతను నెలకొల్పడానికి కొత్త శకం ఆరంభమైందన్నారు. ఈ రోజు యోగా దినోత్సవంతో మానవ మేధస్సుకు శిక్షణ అందించే కార్యక్రమానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది యోగా దినోత్సవాన్ని జరుపుకొనడం గొప్ప విషయమని.. ఇదంతా భారత్ గొప్పతనమేనని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కొనియాడారు. న్యూఢిల్లీ, జూన్ 21: కుల, మత, వర్ణ, దేశాలు, ప్రాంతీయాల కతీతంగా యోగా ఔత్సాహికులంతా చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు. అంతర్జాతీయ తొలి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా యోగా కేంద్రంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని, వాతావారణ ప్రతికూల పరిస్థితులను, పలు ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనల్ని పక్కనబెట్టి ఆదివారం ఉదయమే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యోగా ఔత్సాహికులు చాపలు, ఇతర సామాగ్రిని చేతబట్టుకొని ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. పార్కులు, చర్చిలు, నివాసాలు, మిలటరీ స్థావరాలు, గగన తలాలతోపాటు విశ్వవ్యాప్తంగా 44 ఇస్లామిక్ దేశాలతోపాటు 177 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు భారత్ నాయకత్వం వహించింది. ప్రాచీన సంప్రదాయ యోగాసనాలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఈఫిల్ టవర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.., సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు.. ప్రపంచశాంతిని, సమగ్రత, ఐక్యతను చాటిచెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయవేత్తలు, అధికారులు, త్రివిధ దళాలు, రైల్వే, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా డే వేడుకల్ని ప్రారంభించారు. ఆధునిక జీవిన విధానంలో తలెత్తే శారీరక వైకల్యాన్ని అధిగమించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రణబ్ పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి యోగా సాధనకు భారత్ ప్రధాన కేంద్రమని అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో రాజపథ్‌లో 37 వేల మందితో నిర్వహించిన మెగా యోగా ఈవెంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపెద్ద యోగా శిబిరం రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నది. భారీ సైజులో ఏర్పాటు చేసిన డిజిటల్ స్కీన్లపై హిందీ, ఆంగ్ల భాషల్లో యోగాసనాలకు సంబంధించిన సూచనల్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల మాదిరిగానే రాజ్‌పథ్ చుట్టుపక్కల దాదాపు ఐదువేల మంది భద్రతాసిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నా.. ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తపాల బిళ్లలను, రూ.10, రూ.100 నాణేలను ప్రధాని మోదీ విడుదల చేశారు. పలురాష్ర్టాల్లో కేంద్ర మంత్రులు: తెలంగాణ, ఏపీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, పలు రాష్ర్టాల్లో నిర్వహించిన వేడుకల్లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ర్టాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో సంజీవయ్యపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ, లక్నోలో హోంమంత్రి రాజ్‌నాథ్, కోచీలో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు, కోల్‌కతాలో హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, చెన్నైలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేసిన ఆసనాలు ఇవే... ఉదయమే చాపతో రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రధాని మోదీ మొత్తం 21 అసనాలు వేశారు. పాదహస్త ఆసనం, అర్థచక్ర ఆసనం, త్రికోణాసనం, దండాసనం, అర్థ ఉష్ట్రాసనం, వజ్రాసనం, శశాంకాసనం, విక్రాసనాలను వేశారు. సెల్ఫీలకు ప్రధాని నో...: ఏ కార్యక్రమం జరిగినా.. సందర్శకులతో ఎప్పుడూ మొబైల్ ఫోన్లలో సెల్ఫీ ఫోటోలకు ఫోజిచ్చే ప్రధాని మోదీ ఈసారి అలాంటి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తన ప్రసంగం తర్వాత యోగా కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన తన స్థానానికి చేరుకున్న మోదీ.. ఓ మహిళా వాలంటీర్ సెల్ఫీ దిగడానికి రాగా.. ముకులిత హస్తాలతో ఆమె విజ్ఞప్తిని నిరాకరించారు. సియాచిన్‌లో సైనికుల యోగా విన్యాసాలు ఏడాది పొడుగునా మంచు దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే సియాచిన్ యుద్ధ స్థావరంలో త్రివిధ దళాలకు చెందిన భారత సైనికులు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సముద్ర మట్టానికి 18800 అడుగుల ఎత్తైన ప్రదేశంలో.. మైనస్ 4 డిగ్రీల వాతావారణాన్ని తట్టుకునేలా ప్రత్యేక దుస్తులు ధరించి సైనికులు యెగా కార్యక్రమాల్ని నిర్వహించారు. లడఖ్, కార్గిల్‌తోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతా విస్తరించిన సైనిక దళాలకు చెందిన సిబ్బంది యోగాసనాలు వేశారు. మెగా ఈవెంట్‌కు రెండు గిన్నిస్ రికార్డులు రాజ్‌పథ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు లభించింది. ఒకే ప్రదేశంలో 84 దేశాలకు చెందిన జాతీయులతోపాటు 35,985 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం రెండు రికార్డు సొంతం చేసుకున్నది. ఈ రికార్డులను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు వెరిఫికేషన్ గ్లోబల్ హెడ్ మార్కో ఫ్రిగట్టి ధ్రువీకరించారు. ఒకే రోజు రెండు రికార్డులను సొంతం చేసుకోవడం దేశానికి గర్వ కారణమని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాదనాయక్ మీడియాతో అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. 2005 నవంబర్ 19న గ్వాలియర్‌లోని జీవాజి వర్సిటీలో వివేకానంద కేంద్రం పర్యవేక్షణలో 362 పాఠశాలలకు చెందిన 29,973 మంది విద్యార్థులు 18 నిమిషాలపాటు యోగాసనాల కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.


మళ్లీ ఎమర్జెన్సీ రాదని చెప్పలేం...... బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు


malli emarjensi raadani cheppalem



ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయ్ -మోదీ సర్కారుపై బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు -అద్వానీ చెప్పింది అక్షర సత్యం: విపక్షాలు -ఆయన వ్యవస్థ గురించి చెప్పారు.. వ్యక్తుల గురించి కాదు: 2015 జూన్ 18: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనపడిందని, దాంతో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడుగా కూడా ఉన్న అద్వానీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ మాటలు నూటికి నూరుపాళ్లు నిజమని విపక్షాలు పేర్కొన్నాయి. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ నుంచే తీర్పు వెలువడిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అయితే, బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం ఆచితూచి స్పందించాయి. అద్వానీ వ్యక్తుల గురించి మాట్లాడలేదని, వ్యవస్థ గురించి చెప్పారని అభిప్రాయపడ్డాయి. విధ్వంసకర శక్తులు బలపడ్డాయి దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనం కావటంతో విధ్వంసకర శక్తులు బలపడ్డాయని అద్వానీ అన్నారు. ఈ పరిణామం వ్యవస్థల ధ్వంసానికి దారితీయవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ, చట్ట రక్షణ వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకత్వంలో పరిణతి లేదని చెప్పను. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి అత్యవసర పరిస్థితి రాదన్న నమ్మకంలేదు. మన రాజకీయ వ్యవస్థలోని అత్యున్నత నాయకత్వం నుంచి ఆ మేరకు భరోసా రావటంలేదు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత లోపించింది. రాజకీయ నాయకత్వం బలహీనంగా మారటంతో నాకు దానిపై నమ్మకం పోయింది. అత్యవసర పరిస్థితి విధించటం అంత తేలికేం కాదు. కానీ, ఆ పరిస్థితి రాదని మాత్రం చెప్పలేను అని పేర్కొన్నారు. ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 నుంచి 1977 వరకు దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి విధించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. నాటి ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా అద్వానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ, ఆ తర్వాత బీజేపీలో దాదాపు ఒంటరయ్యారనే అభిప్రాయం ఉంది. ఆయన గతంలోకూడా మోదీ ప్రభుత్వ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు తరుచూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటం, ఘర్‌వాపసీ పేరుతో ఆరెస్సెస్ శాఖలు మత మార్పిడులకు పాల్పడుతుండటంతో మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ వ్యాఖ్యలు మోదీ సర్కారుపై కాదు: బీజేపీ, ఆరెస్సెస్ అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి కాదని బీజేపీ, ఆరెస్సెస్ ప్రకటించాయి. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడైన అద్వానీ ప్రధాని మోదీకి ఈ విధంగా సందేశం ఇస్తారని తాను భావించటంలేదని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య అన్నారు. ఏమైనా చెప్పదలిస్తే ఆయనకు నేరుగా మోదీని కలిసే స్థాయి ఉందని తెలిపారు. ఆయనకు ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశం కనిపించటంలేదని పేర్కొన్నారు. అద్వానీ వ్యాఖ్యలు వ్యక్తులను ఉద్దేశించినవి కావని, వ్యవస్థల గురించే ఆయన మాట్లాడారని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ అభిప్రాయపడ్డారు. అద్వానీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. కానీ, దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు లేవు. ఆ యుగం ముగిసిపోయింది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ఎంతో శక్తిమంతమైంది అని పేర్కొన్నారు. అద్వానీ మాటలు అక్షర సత్యాలు: ప్రతిపక్షాలు ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలన్నీ సమర్థించాయి. మోదీ ప్రభుత్వ విధానాల తీరును అద్వానీ పరోక్షంగా వెల్లడించారని పేర్కొన్నాయి. -మోదీ పాలనలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని అద్వానీ చెప్పకనే చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చదివితే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన పాలనపై అధికార పార్టీ నుంచే తీర్పు వెలువడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారో.. ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉందో.. ప్రధాని ఎవరో.. అన్నీ ఆయనకు తెలుసు. బీజేపీలో అద్వానీ రాజనీతి నిపుణుడు. ఆయన చెప్పింది పూర్తిగా నిజం. -టామ్ వాదక్కన్, కాంగ్రెస్ ప్రతినిధి -బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో అద్వానీ ఒకరు. ఆయన ఆందోళనను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీహార్ రాష్ట్రం ప్రతిరోజూ ఎమర్జెన్సీ పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. -దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అద్వానీజీ సరిగ్గానే చెప్పారు. మోదీ సర్కారు మొదటి ప్రయోగం ఢిల్లీయేనా? - అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. -అద్వానీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మాటల్లోని అంతరార్థం స్పష్టంగా అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వంలో అధికార దర్పం ఛాయలు కనిపిస్తున్నాయి. -సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ కార్యదర్శి -అద్వానీ లేవనెత్తిన విషయంపట్ల ఆయన సీరియస్‌గా ఉంటే సూటిగానే చెప్పాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలెదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు అధికారపక్షం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ప్రభుత్వం పార్లమెంటును, ఇతర వ్యవస్థలను బలహీనపరుస్తున్నది


Followers