అంతరిక్ష చరిత్ర సృష్టించిన భారత్

ఈ ఏడాది ఇస్రో వరుస ప్రయోగాలతో జైత్రయాత్ర సాగించింది. ప్రథమార్థంలో స్వదేశీ క్రయోజనిక్ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ సాయంతో బరువైన జీషాట్-14 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిర్ధేషిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో రెండవ నావిగేషన్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ24 ద్వారా ప్రయోగించింది. జూన్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ23 రాకెట్ ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చారు. సెప్టెంబరులో ఇస్రో అరుదైన విజయం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను అరుణ గ్రహ కక్ష్యలోకి ఫలప్రదంగా ప్రవేశపెట్టింది. దీనికి దేశంలోనే కాక ప్రపంచం నుండి ప్రశంసలు వచ్చాయి. 


జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 3,735 కిలోల వ్యోమగాముల గదిని 126.15 కి.మీ ఎత్తులో మార్క్-3 ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోకి మానవులను పంపే క్రమంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే విజయవంతంగా మానవులను పంపించాయి. నేడు ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగ విజయవంతంతో అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా భారత్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ వ్యయం రూ.155 కోట్లు. 

Followers