ఇష్టపడి చదవడంవల్లే గేట్‌లో ఫస్ట్



జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గేట్ నగాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2014) పరీక్షా ఫలితాల్లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో 988 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించాడు గోపు భరత్‌రెడ్డి. ఈ సందర్భంగా కరీంనగర్ నివాసి అయిన భరత్‌రెడ్డిని ఫోనులో టీమీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆయన మాటల్లో... ప్రస్తుతం నేను జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాను. మరో మూడు నెలల్లో ఇంజినీరింగ్ కోర్సు పూర్తవుతుంది. వెంటనే ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువాలన్నది నా కోరిక. ఇప్పుడే విదేశాలకు వెళ్లాలని లేదు. నేను సీనియర్ల సలహాలు, సూచనల మేరకు గేట్ పరీక్షకు సిద్ధమయ్యాను. రెండు మూడు నెలలు అంకుఠిత దీక్షతో ఇష్టపడి చదివాను. ప్రథమర్యాంకు వస్తుందని ఊహించలేదు. నా కష్టానికి ఫలితం దక్కింది. తాతయ్య రాజారెడ్డి (విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, తండ్రి ఇంద్రాసేనారెడ్డిల స్ఫూర్తితోనే చదువంటే ఇష్టం కలిగింది. ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్‌కు మాది. మా అమ్మానాన్నలు లక్ష్మీ, గోపు ఇంద్రాసేనారెడ్డి. వారు ప్రస్తుతం కరీంనగర్ మంకమ్మతోటలోని నివాసముంటున్నారు. నేను ప్రాథమిక విద్యను కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ లారెల్ స్కూల్‌లో, 6 నుంచి 10వ తరగతి వరకు డాన్‌బాస్కో స్కూల్‌లో చదివాను. పదిలో (2006-07)లో 552 మార్కులు సాధించాను. అనంతరం ఇంటర్ నారాయణ జూనియర్ కళాశాలలో చదివాను. ఐఐటీ అంటే ఇష్టముండటం వల్లనే ఎంట్రెన్స్‌లో ఆల్‌ఇండియా లెవెల్ ఓపెన్ కెటగిరిలో 5900 ర్యాంకు సాధించాను. జార్ఖండ్‌లో సీట్ వచ్చింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి నేను చెప్పేదొక్కటే ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. - జి. రాజేంద్రప్రసాద్, కరీంనగర్ ఎడ్యుకేషన్ రిపోర్టర్ 


బ్లడ్ క్యాన్సర్‌కి కొత్త పరీక్ష


ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్‌ని అయినా ఒకే ఒక రక్తపరీక్షతో కనుక్కోగలగడం ఇప్పుడు సాధ్యమవుతుందంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ఉన్న రక్తపరీక్ష ద్వారా 60 శాతం కేసులను గుర్తించగలుగుతున్నప్పటికీ మిగిలినవాటికి కారణాన్ని కనుక్కోగలగడం సాధ్యం కాలేదు. అయితే ఇటీవల కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో మిగిలిన 40 శాతం బ్లడ్ క్యాన్సర్లకు కారణమయ్యే జన్యువును గుర్తించగలిగారు పరిశోధకులు. న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనాంశాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు క్రానిక్ బ్లడ్ క్యాన్సర్లను గుర్తించడానికి రకరకాల పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు ఎక్కువ సంఖ్యలో తయారు కావడం వల్ల వచ్చే ఈ క్యాన్సర్ల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వచ్చి ప్రాణాపాయం కలుగుతుంది. కొంతమందిలో ఈ క్యాన్సర్లు ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించవు. మరికొందరిలో ఇవి ల్యుకేమియాగా మారవచ్చు. ఇప్పుడు ఒక్క రక్తపరీక్షతో అన్ని రకాల క్యాన్సర్లనూ గుర్తించవచ్చు అని చెప్పారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ హెమటాలజీ ప్రొఫెసర్ టోనీ గ్రీన్. ఇప్పుడు కనుక్కున్న సీఏఎల్‌ఆర్ జన్యువు కణస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. కణంలో తయారైన ప్రొటీన్లను మెలికలు పడేలా చేస్తుంది. ఈ జన్యుపరీక్ష వల్ల బ్లడ్ క్యాన్సర్లకు ఆధునిక చికిత్సలను కనుక్కోగలిగే వీలుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ జ్యోతి నంగాలియా.




Followers