స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటిన తరువాత కూడా మన లౌకిక
ప్రజాస్వామిక వ్యవస్థ విషమ పరీక్షను ఎదుర్కొంటున్నది. మతం మారడం, వెనకకు
రావడం అనేది వ్యక్తి ఇష్టానికి పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ వివాదంగా
మారిపోతున్నది. ధరమ్ జాగరణ్ సమితి అనే సంస్థ ఈ నెల ఎనిమిదవ తేదీన ఆగ్రాలో
ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టి రెండు వందల మంది ముస్లింలను హిందు మతంలోకి
మార్చిందని తెలుస్తున్నది. క్రిస్మస్ రోజున అలీగఢ్లో ఐదు వేల మందిని హిందు
మతంలోకి చేర్చుకుంటామని ఈ సంస్థ ప్రకటించింది. దీనిపై పార్లమెంటులో దుమారం
చెలరేగడంతో స్థానిక జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని నిషేధించింది. తాము
ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని, పై నుంచి అనుమతి రాగానే
నిర్వహిస్తామని సమితి నాయకులు అంటున్నారు.
బీహార్లోని భాగల్పూరు సమీపాన గల బరోహియా గ్రామంలో ఐదుగురు (హిందువులు)
క్రైస్తవ మతం పుచ్చుకున్నారని, వారిని కొందరు సంఘపరివార్ కార్యకర్తలు మళ్ళా
హిందు మతంలోకి మార్చారని అంటున్నారు. తమ వ్యాధి తగ్గినందువల్ల క్రీస్తు
పట్ల విశ్వాసం వ్యక్తం చేశామని, మతం మారలేదని ఆ ఐదుగురు చెప్పారని, తాము
ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు
అంటున్నారు. కొందరు ఆరెస్సెస్ కార్యకర్తలు వీరిని మళ్ళా హిందు మతంలోకి
మార్చి అందుకు సంకేతంగా గంగానదిలో స్నానం చేయించి, ఆలయంలో పూజలు చేయించారని
స్థానికులు వెల్లడిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లా
కమలాపురి గ్రామంలో డ్బ్బై మంది హిందువులు క్రైస్తవ మతంలోకి మారారనే వార్త
ఉద్రిక్తతలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టేరియల్ దర్యాప్తునకు
ఆదేశించింది. స్థానికులు కొందరు మతం మారలేదని అంటుండగా, మిగతా వారు ఇండ్లకు
తాళాలు వేసి పరారయ్యారు. దీనిని బట్టి ఉద్రిక్తతలు ఎంతగా పెరిగిపోతున్నాయో
తెలుస్తున్నది.
ఇతర మతాలకు హిందుమతస్తులను చేర్చుకునే హక్కు ఉన్నట్టే హిందు మత పెద్దలకు
ఇతరమతస్తులను చేర్చుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ మతం వైపు మొగ్గు
చూపకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించాలె. ఏమతస్తులు
బలవంతానికి,ప్రలోభాలకు పాల్పడకుండా పెద్ద మనిషి పాత్రను పోషించాలె. అన్ని
మతాల పెద్దలు కూడా పరస్పరం చర్చించుకొని సామరస్యం సాధిస్తే ఉద్రిక్తతలకు
తావుండదు.
మత మార్పిడుల పేరుతో ఉద్రిక్తతలు పెరిగిపోతుండడం పట్ల కొద్ది రోజులుగా
పార్లమెంటులో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలే లోక్సభలో ఓ కేంద్ర
మంత్రి మాట్లాడుతూ- అన్ని రాష్ర్టాలు, కేంద్రం మత మార్పిడుల నిరోధక చట్టం
చేయాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఐదు రాష్ర్టాలు ఇటువంటి చట్టాలు చేశాయి.
ఈ నేపథ్యంలో ఇటువంటి చట్టాలు సమస్యను పరిష్కరించగలుగుతాయా? అవి రాజ్యాంగ
స్ఫూర్తికి విరుద్ధం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని
రాష్ర్టాలలో మాదిరిగా- మత మార్పిడి చేసుకోవాలంటే మొదట ప్రభుత్వానికి
సమాచారం అందించి నిర్దేశిత కాలం తరువాత మారాలని ఆంక్షలు పెట్టడం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదనీయం కాదు. ఒక మనిషికి ఒక మతంపై లేదా దేవుడిపై
నమ్మకం ఏర్పడవచ్చు. అది అతడి వ్యక్తిగత విషయం. దీనిపై ప్రభుత్వ నియంత్రణ
ఉండడం భావ స్వేచ్ఛకు భంగకరం. రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛను, మత ప్రచార
హక్కును గుర్తిస్తున్నది. బహుళత్వం భారతీయ సమాజ లక్షణం. వైదికంలోని భిన్న
శాఖలు, వైదికేతర బౌద్ధ జైన మతాలు భారతీయ సమాజాన్ని సుసంపన్నం చేశాయి.
ఇప్పటికీ వైదిక పరిధిలోకి రాకుండా గ్రామీణ దేవతలను పూజించేవారున్నారు.
ఒకప్పుడు రాజు ఒక మతాన్ని, రాణి మరో మతాన్ని అవలంబించిన సందర్భాలు ఉన్నాయి.
ఇటువంటి సహజీవన సంస్కృతిని కాపాడుకోవడం ఎట్లా అనేది మన రాజకీయ నాయకత్వం
ఆలోచించాలె.
బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించ వలసిందే. ప్రలోభాలతో మత మార్పిడి
చేయడం ఆయా మత సూత్రాలకే విరుద్ధం. అయితే వీటిని అరికట్టడం చట్టాలతో సాధ్యం
కాదు. ప్రజలను పేదరికం నుంచి బయట పడేయడం, విద్యావంతులను చేయడం ద్వారా ఈ
సమస్యను పరిష్కరించవచ్చు. మన దేశంలో హిందుమతం అధిక సంఖ్యాకుల విశ్వాసంగా
ఉన్నప్పటికీ, ప్రపంచం కుంచించుకుపోయిన నేపథ్యంలో ఒక రకమైన అల్పసంఖ్యాక
భావనకు, భద్రతా రాహిత్యానికి గురవుతున్నది. అందువల్ల ఈ మత ప్రముఖుల
ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. అయితే కుల వ్యవస్థ, అస్పృశ్యత వంటి సామాజిక
జాడ్యాల వల్ల అట్టడుగు వర్గాల వారు స్వాభిమానం కాపాడుకోవడానికి, భద్రత కోసం
ఇతర మతాలలో చేరవచ్చు. తమ మతాన్ని సంస్కరించుకోవడం ద్వారానే ఈ బలహీనతలను
అధిగమించగలమని హిందు మత పెద్దలు గ్రహించాలె. యూరప్లో ప్రాటెస్టెంట్ ఉద్యమం
ఉధృతమైనప్పుడు క్యాథలిక్ మత పెద్దలు ప్రతి సంస్కరణోద్యమం నిర్వహించడం
గమనార్హం.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన జరిపితే
ప్రలోభాలతో మత మార్పిడులు జరుగుతాయనే ఆందోళనకు తావుండదు. ఇతర మతాలకు హిందు
మతస్తులను చేర్చుకునే హక్కు ఉన్నట్టే హిందు మత పెద్దలకు ఇతర మతస్తులను
చేర్చుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ మతం వైపు మొగ్గు చూపకుండా అన్ని
మతాలను సమానంగా గౌరవించాలె. ఏ మతస్తులు బలవంతానికి, ప్రలోభాలకు పాల్పడకుండా
పెద్ద మనిషి పాత్రను పోషించాలె. అన్ని మతాల పెద్దలు కూడా పరస్పరం
చర్చించుకొని సామరస్యం సాధిస్తే ఉద్రిక్తతలకు తావుండదు. మన లౌకిక,
ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత మన అన్ని పక్షాలపై ఉంది.
ఆరోగ్య హక్కు
కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం- 2015
ముసాయిదా ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సూచించడం హర్షణీయం.
సూచనలను స్వీకరించడానికి ఈ ముసాయిదాను ప్రజల ముందు పెట్టడం వల్ల చర్చకు
ఆస్కారం ఏర్పడింది. రాజ్యాంగం పౌరుడి జీవించే హక్కును గుర్తిస్తున్నది.
ఆరోగ్య పరిరక్షణ ఇందులో భాగమే. అంతర్జాతీయ ఒడంబడికలు, న్యాయస్థానాల
తీర్పులు, వివిధ దేశాలలో పోకడలు అన్నీ ఆరోగ్య హక్కును గుర్తించక తప్పని
పరిస్థితిని కల్పిస్తున్నాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలని
భావిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య రక్షణకు, వైద్య వసతుల కల్పనకు చర్యలు
తీసుకోవలసిందే. సూత్రప్రాయంగా ఆరోగ్య విధాన ముసాయిదా ప్రజల ఆరోగ్య
పరిరక్షణకు పూచీ ఇస్తున్నప్పటికీ ఈ సదాశయం ఆచరణలో ఎంత వరకు
ప్రతిఫలిస్తుందనే సందేహం కలుగుతున్నది.
ఆరోగ్యాన్ని హక్కుగా గుర్తిస్తే ప్రభుత్వం దీనిని అందించలేక పోవడం నేరంగా
మారుతుంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్య
విధాన ముసాయిదాలో ఉన్న మరో ప్రధాన అంశం- అనారోగ్యం కలగకుండా ముందు జాగ్రత్త
చర్యలు తీసుకోవడం. పరిశుభ్రత, పోషకాహారం, పొగాకు మద్య సేవనాన్ని
అరికట్టడం, కాలుష్య నియంత్రణ, మహిళలపై హింసను నిరోధించడం మొదలైన ఏడు
అంశాలతో కూడిన స్వాస్థ్య నాగరిక అభియాన్ సామాజిక ఉద్యమాన్ని చేపట్టాలని
ముసాయిదా సూచిస్తున్నది.
విద్యా సెస్ మాదిరిగా ఆరోగ్య నిధులను సేకరించాలని కూడా ప్రభుత్వం
భావిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, మందులు,
సూచనలు ఇవ్వాలని ముసాయిదా నిర్దేశిస్తున్నది. అయితే ప్రైవేటు రంగ విపరీత
పోకడలను అరికట్టడంపై ఆరోగ్య విధాన ముసాయిదాలో స్పష్టత లేదు. పైగా ఈ
నియంత్రణ లైసెన్స్ రాజ్కు దారి తీస్తుందనే ఆందోళనను ప్రస్తావించింది.
అట్టడుగు వర్గాలకు ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అయితే స్థోమత
ఉన్న వారు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తే వారు మోసపోకుండా చూడవలసిన బాధ్యత
కూడా ప్రభుత్వంపై ఉంటుంది.
ఆరోగ్య బీమాను విస్తరింప చేయడంతో తమ బాధ్యత తీరుతుందని ప్రభుత్వం
భావించకూడదు. వైద్య విద్యను గగన కుసుమంగా మార్చడం ఈ సమస్యలకు ఒక కారణం.
వైద్య విజ్ఞానాన్ని మరింత విస్తృతం చేస్తే, వైద్యం వ్యాపారంగా కాకుండా
సేవారంగంగా మిగులుతుంది. ఆయుర్వేద, హోమియోపతి వంటి వైద్య విధానాలపై కేంద్ర
ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని ముసాయిదాను బట్టి తెలుస్తున్నది. వైద్య
రంగంలో ఆధునిక విజ్ఞానాభివృద్ధిని ఆయుర్వేదానికి కొనసాగింపుగా అర్థం
చేసుకొని రెండింటినీ మిళితం చేయాల్సింది. కానీ ఆయుర్వేదాన్ని ముతక విధానంగా
ఆలోపతిని ఆధునికతకు చిహ్నంగా మార్చారు.
విజ్ఞానాన్ని ఈ విధంగా విడదీయడమే పొరపాటు. వైద్య పరిజ్ఞానాన్ని
సమగ్రమైందిగా తీర్చిదిద్దకుండా పరస్పర అవగాహన లేని వైద్యులను తయారు చేయడం
మంచి పద్ధతి కాదు. ముసాయిదాలో సమగ్రత దిశగా అడుగు వేయాలనే ఆలోచన
వ్యక్తమైనప్పటికీ స్పష్టత లేదు.
ఆరోగ్య విధాన ముసాయిదాను అర్థం చేసుకునే ముందు క్షేత్ర స్థాయి పరిస్థితిని
కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు
అమలయిన తరువాత- గ్రామీణ ప్రాంతంలో ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడ్డది.
ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పైకి గొప్పగా పనిచేసినా ఆ నిధులు ప్రైవేటు
ఆస్పత్రులను బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా
తగినంత వైద్య సదుపాయాలు ప్రభుత్వ రంగంలో లేవు. దీనికి తోడు ప్రైవేటు
రంగంపై నియంత్రణ లేక పోవడం పెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రులు, వైద్యులు,
మందుల కంపెనీలు కుమ్మక్కు కావడం, నగర ఆస్పత్రులు గ్రామీణ వైద్యులు అవగాహనకు
రావడం మొదలైన వికృత పోకడల వల్ల పేదలు మందులపై అవసరం లేని శస్త్ర
చికిత్సలపై వ్యయం చేయవలసి వస్తున్నది.
సహజంగా జరిగే ప్రసవానికి బదులు శస్త్ర చికిత్స చేయడం, అనేక మంది మహిళలకు
అవసరం లేకున్నా గర్భసంచి తీసివేయడం వంటి ఈ వికృత పోకడల దుష్ఫలితాలే. ఈ
పరిస్థితిని చక్కదిద్దాలంటే తగిన నియంత్రణా వ్యవస్థ ఉండాలె. స్వీయ నియంత్రణ
వల్ల మార్పు సాధ్యమనే వాదన ఉన్నప్పటికీ, ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు
సాగుతున్నప్పటికీ, ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం పటిష్టమైన నియంత్రణ
విధానాన్ని అవలంబించడం అవసరం. ప్రభుత్వం సదుద్దేశంతో, సమర్థవంతంగా
వ్యవహరించినప్పుడు నియంత్రణ చక్కగా సాగుతుంది, లైసెన్స్రాజ్ మళ్ళా వ
చ్చిందనే ఆరోపణలకు తావుండదు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచడం, మంచినీటి
వసతి కల్పించడం, పారిశుధ్య చర్యలు చేపట్టడం వంటి కనీస బాధ్యతను ప్రభుత్వాలు
నిర్వర్తిస్తే చాలా వరకు ఆరోగ్య హక్కును పరిరక్షించినట్టవుతుంది.
Subscribe to:
Posts (Atom)